Tuesday 15 August 2017

నేను సైతం : గవిడి శ్రీనివాస్ - జగద్ధాత్రి

నేను సైతం : గవిడి శ్రీనివాస్
గవిడి శ్రీనివాస్, నేడు చాలామంది సాహితి ప్రియులకి తెలుగు పాఠకులకి బాగా పరిచయమున్న పేరు. “గవిడి శ్రీనివాస్ ఊహాశాలి. చీకట్లో వెలుగుతున్న ఆత్మనెలా ఆవిష్కరించాలి, తన మానసిక నేత్రంతో దర్శించి దాన్ని, భౌతికంగా ప్రకృతిని , పరిసరాల్నీ, చూసిన దాన్ని మన ముందుంచటానికి తను ఈ కవితా సంపుటిలో కృషి చేశాడు” అని కితాబిచ్చారు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కర గ్రహీత , ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి శ్రీనివాస్ ‘వలస పాట’ కవితా సంపుటికి. సామాజిక స్పృహ ఉన్న కవిగా నాగ భైరవ కోటేశ్వర రావు గారు, అద్దేపల్లి రామమోహనరావు గారు, డాక్టర్ రామసూరి వంటి పెద్దలనుండి ప్రశంసలు పొందిన యువ కిశోరమ్ గవిడి శ్రీనివాస్. ‘మిత్రుడు గవిడి శ్రీనివాస్ ఈ ఉత్తమాంధ్రలో వికసించిన మరో కుసుమం’ అన్నారు సాహితీ స్రవంతి వారు. సాహితీ స్రవంతి తో కలిసి నడుస్తూ , ఆ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగే కవి గవిడి శ్రీనివాస్. సమాజం లోని అసమానతలకు, అన్యాయాలకు తక్షణం స్పందించే యువ కవుల్లో శ్రీనివాస్ ఒకరు.
శ్రీనివాస్ జీవిత విశేషాలు
గవిడి శ్రీనివాస్1977, 1977, జూన్13న గాతాడలో పుట్టారు. తిమిటేరు బూర్జవలస
లో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తండ్రి సూర్యనారాయణ వీరోఓగా పనిచేసేవారు. 1999 నుండి 2010 వరకు సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయుని గా చేశారు.2010 నుండి నోర్డ్ సిన్యూ , సిఎంబియోసిస్ టెక్నాలజీస్ , సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు .ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖ పట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి బి .ఎడ్ . పూర్తీ చేశారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్ గా చేశారు .
రచనలు
1.కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ
2.వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ
పాటలు 1 . తొలితొలి ఆశల్లో (ఆల్బమ్)
కవిగా గీత రచయితగా అక్షర సైనికుడై సామాజిక చైతన్యానికై కవాతు చేస్తున్న శ్రీనివాస్ ఎందరో యువ కవులకు స్ఫూర్తి. చిరునవ్వుతో పలకరిస్తున్నా అతని మేధోనేత్రం మాత్రం నిత్యం సమాజ శ్రేయస్సును కోరుతూనే ఉంటుంది. అందుకు తాను కూర్చగల, కవిత్వాన్ని రచించుకుంటూనే ఉంటుంది. నిర్మలంగా నవ్వుతూ పలకరించడం, సాహిత్యాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవడం నిరంతర విద్యార్ధిగా వినమ్రంగా మసలడం శ్రీనివాస్ వ్యక్తిత్వానికి మెరుగు పెట్టే అంశాలు.
శ్రీనివాస్ కవిత్వం, తత్వం గురించి తెలుసుకుందాం . ఈ చిన్ని కవిత ఈ కవి భావుకతకీ, పుట్టిన ఊరు మీద, తన వారి మీద మమకారానికి ప్రతీక గా నిలుస్తుంది.
ఊగే ఈ గాలిలో
ఊగే... ఈ గాలిలో
ఈ నేలలో
గుండెను తడిపేవిశ్వజనీన భాష ఏదో ఉంది
జారుతున్న పొద్దులో
చలిదుప్పట్లో దాక్కుంది
వెచ్చదనం ముసుగేసుకున్న
చుట్ట వొణికిన తాతను చుట్టుకుంది
రింగు వలయాల్లో రంగులు
మారుతూ
తలపాగాలో ముసుగుతన్నింది (ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం 20/8/2005)
శ్రీనివాస్ లోని భావుకతకు, ప్రాపంచిక స్పృహకు తార్కాణంగా నిలిచే ఈ కవిత చూద్దాం
ఒక గుప్పెడు రాత్రులు
రాత్రులన్నీ
సజావుగా నిద్రపోవు
గుప్పెడు జ్ఞాపకాలు తట్టి
మది కడలి
కల్లోలితమవుతుంది .
ఈ ప్రపంచీకరణ ప్రపంచం
వైకుంఠ పాళీ అవుతుంది .
కదిలే అడుగులలో
వొణికిన సవ్వడులెన్ని.
ముంచుతున్న పనివేళల
మంచు తెరల వెనుక
నలిగిన జీవికలెన్ని .
మబ్బుల్ని ఢీకొట్టి
మంటల్ని ఊపినట్లు
ఊపిరి ఉక్కపోత తో
బిగుసుకుంటుంది .
ఆశంతా
ఒక గుప్పెడు రాత్రులు
ఎగసీ
నిద్రపుచ్చేవి
రెక్కలు కట్టుకు ఉగుతుంటాయనీ
కలగంటూ...నేను !
నేటి ప్రపంచీకరణ సమయంలో సామాన్యుని పక్షాన నిలిచి పలికే అక్షర యోధుడు శ్రీనివాస్. కల్లోలిత మౌతోన్న అoతరంగం తో తన తోటి వారికి వారితో బాటు తాను అనుభవిస్తోన్న పరాయీకరణ నుండి మేల్కొల్పడం, వారిలో సామాజిక స్పృహ కలిగించడం శ్రీనివాస్ కవిత్వ తత్వం. వసుధైవక కుటుంబకం అని భావించే మన ప్రాచీన స్పృహ శ్రీనివాస్ కవిత్వంలో కనపడుతుంది. ఆ విశ్వకుటుంబాన్ని సాధించే లక్ష్యంగా తన అక్షరాల దారి మనకి సుస్పష్టంగా అగుపిస్తుంది.
“పూర్తి కాని కలలా
మిగిలిన నేలపై రైతు .
సగం బతుకు వలసపోతూ
మోడుగా మిగిలిన రైతు .
మట్టిలో కంది చెట్టులా
పాతుకుపోయినా
మిరప కారాలు
తగులుతూనే వున్నాయి .
జొన్నసేలు ఊపుతూనే వున్నాయి .
పత్తి ఆశలు తేలుతూనే వున్నాయి .
ధాన్యం రాశులు గా ఎగరకుండా
ఒక నిలకడ కోసం
నాల్గు దిక్కుల్ని నల్లని ఆకాశాన్ని
భూమిని
గుప్పెట్లో బంధిస్తున్నా
రైతు పర్వం
అడుగు అడుగునా
కుదుపుతూనే వుంది . (రైతు పర్వం)
పంట పండిస్తోన్న రైతు కడుపునిండా రెండు పూటలా తిండికి నోచుకోవడం లేదు. రైతు బిడ్డగా వారి జీవనాన్ని చూస్తున్న కవి ఆర్ద్రమైన అక్షరాల్లో రైతు పర్వాన్ని రచిస్తాడు.
అన్నదాత రైతుకే అన్నం లేని స్థితిలో , దళారుల మోసాలలో మోసపోతూ , నిత్య దరిద్రాన్నే అనుభవిస్తున్న రైతు జీవనం లో మార్పు రావాలని ఆశిస్తాడీ స్వాప్నిక కవి. పత్తి రైతుల ఆత్మహత్యలు , నుండి నేటి మిర్చి రైతుల వరకూ సాగుతోన్న ధు:ఖమయ రైతు జీవితాన్ని చిత్రిస్తూనే , అందులోని మార్పునాశిస్తాడు, కవిగా శాసిస్తాడు ఈ కవి. ఆశాజీవి అటు రైతు, ఇటు కవి. ఇద్దరూ కోరుకునేది సమాజంలో ని అసమానతలు రూపు మాయడం. ఉత్తమమైన కవిత్వాన్ని అందించే శ్రీనివాస్ మంచి గీత రచయిత కూడా. ‘తొలి తొలి ఆశల్లో’ అనే ఆల్బమ్ కూడా వెలువరించారు. ఆశాజీవి , అక్షరాల విశ్వాసి అయిన ఈ కవిని కదిలించని సామాజిక సమస్య లేదు. నిరంతరం సమాజానికి కాపలాదారుగా నిలిచే ఈ కవి ఆశావాహ దృక్పధం ఈ వాక్యాల్లో చూద్దాం.
“చీకటిని కలగంటే అలికిన ఆకాశం తప్పా/ చిక్కని వెలుగు జాలరి వలలో ఉదయించదు కాలానికి తెడ్లు కట్టి/నావ దూకినపుడే బతుకులో ఉషోదయానికి తెర తీసినట్టవుతుంది!” అని సుధృఢ విశ్వాసం తో పలికే ఈ కవి మరిన్ని కవితా సంపుటాలను , గీతాలను తెలుగు పాఠకులకోసం రచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శిరాకదంబంద్వారా అభినoదిస్తోంది సాహితీ జగతి . .... జగద్ధాత్రి

No comments:

Post a Comment